Thursday, January 19, 2012

2012 కలియుగాంతం కాదు

ఓం నమో విరాడ్విశ్వకర్మణే నమ:

09-09-09 నాటి నుండే శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారిచే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రారంభం


26-12-2011 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి పట్టాభిషేక మహోత్సవం


2012 కలియుగాంతం కాదు

ఈ సర్వజగత్తుకు సృష్టికర్త అయిన విశ్వకర్మను వేదపితగాను, ఆయన భార్య గాయత్రీదేవిని వేదమాతగాను వేదములు కీర్తించినవి. వారి పుత్రులైన (1)మనుబ్రహ్మ(శివుడు), (2)మయబ్రహ్మ(విష్ణువు) (3)త్వష్టృబ్రహ్మ(బ్రహ్మ), (4)శిల్పిబ్రహ్మ(ఇంద్రుడు), (5)విశ్వజ్ఞబ్రహ్మ (సూర్యుడు)లు పంచబ్రహ్మలుగా పేరుగాంచినారు.

వీరిలో మయబ్రహ్మయైన విష్ణువు భూమండలమును పాపులనుండి రక్షించుటకై అనేక అవతారములు ఎత్తినాడు. వాటిలో పది అవతారములు ప్రాముఖ్యత గాంచినవి. దశావతారములలో చివరిదైన కల్కి లేదా వీరభోగవసంతరాయలుగా అవతరించుటకు ముందు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగా అవతరించినారు. తెలుగువారిలో బ్రహ్మంగారి గురించి, వారు వ్రాసిన కాలజ్ఞానాన్ని గురించి తెలియనివారు అరుదు. ఎక్కడ ఏ వింత జరిగినా ప్రజలు బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నదని అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే.

బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు, నా గణితం ప్రకారం, ఈ క్రింది వరుస క్రమంలో జరుగవచ్చు.


1) శ్రీ వీరభోగవసంతరాయల వారు 'విశ్వావసు' నామ సంవత్సరం (1965-1966) లో జన్మించి అశ్వత్ధామ, దత్తాత్రేయుల వారు, శ్రీ సనారీ విశ్వేశ్వర స్వామివారు,శ్రీ ఆచార్య నాగార్జునుల వారు, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వర స్వామివారు, తదితర సిథ్థపురుషుల వద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తరువాత పరమశివుడిని ప్రార్ధించి వారిచే 'దేవదత్త' మనే గుఱ్ఱమును, 'శుక' మనే చిలుకను, 'రత్నసారు' అనే ఖడ్గమును, కార్ముకము అనే విల్లును, అక్షయ తూణీరములును, పాశుపత అస్త్రమును (22-11-2007 నాడు), ఆశీస్సులను పొంది, తేది.09-09-2009 నాటినుండి బహిరంగంగా దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రారంభించుటకు నిర్ణయించుకున్నారు. ఈ తేది నుండి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తం శ్రీ వీరభోగ వసంతరాయలవారి అధీనంలో ఉంటాయి. బ్రహ్మ వ్రాసిన వ్రాత అంతమై, ప్రజలు వారు చేసే పాప పుణ్యాలనుబట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మఫలితాలు ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తాయి.

2.ప్రమాధి నామ సం||(1999-2000) నుండి కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు విజృంభిస్తాయి.

3.తేది 13.04.2000 నాడు శ్రీ వీరభోగ వసంతరాయలు వారు విజయవాడలో ఇన్ద్రకీలాద్రిపై యున్న కనకదుర్గ దేవాలయాన్ని దర్శించారు. (బహుశా ఆ సం.లోనే వివాహము అయివుంటుంది).

4. అంతర్గత విస్ఫోటనములవల్లగానీ, తీవ్రవాదుల దాడులవల్లగానీ హైదరాబాదుకు, అణుసంస్ధలకు/రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. (2002 నుండి జరిగిన సంఘటనలు గమనార్హం). చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతుక వలసి వస్తుంది, ఆచార్యా నాగార్జునుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు.

5.సం.1987 నుండీ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరమునుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద భద్రకాళీ సమేత వీరభద్ర దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం, మొదలగు ఎన్నో దేవాలయాలు బైటపడతాయి.

6. తేది 09-04-2005 నుండే శ్రీ వీరభోగవసంతరాయలవారు సశరీరంగా దర్శనమిస్తున్నారు. తేది.04/10/2006 న మరియూ 04/09/2009 న శ్రీ స్వామివారు మహానంది సందర్శించారు. 09-09-09 కి ముందు శ్రీ వీరభోగవసంతరాయలవారు మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయము, యాగంటి, శ్రీకాళహస్తి, కుంభకోణం దేవాలయములు రోజుకు మూడుసార్లు దర్శించారు. ఇప్పుడు రోజుకు ఒక్కసారి మాత్రమే దర్శిస్తున్నారు. ఏ రోజున వారి సందర్శన ఆగుతుందో ఆ రోజున ఆయా దేవాలయములు దెబ్బతింటాయి లేదా కూలిపోతాయి.

7.కృష్ణా గోదావరి నదులమధ్య రక్తం ఏఱులై పారుతుంది (ప్రత్యేక రాష్ట్రం కోసం, నీటికోసం, మతకల్లోలాలవల్ల).
ప్రమాద ఘడియలు ముంచుకొస్తున్నయి.

8.తేది.26.12.2011 న శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు సాధారణ పరిపాలకులుగా పట్టాభిషిక్తులైనారు.

9.మూడవ ప్రపంచ యుధ్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు (గురు గ్రహము కుంభరాశిలో ఉండగా) అంతమవుతుంది కాబట్టి 2012లో కలియుగాంతం అవుతుందని అనుకోవటం అర్ధరహితం. 'నందన' నామ సంవత్సరం(2012-13)లో భయంకర ఉత్పాతములవల్ల లక్షలాది జనం నశిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. భగవంతుని రాక ఊహించి, గ్రహములు, ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి, మాయన్ కేలండర్ వ్రాసినవారు పంచాంగ గణితమును అక్కడితో ఆపివుంటారు.(మాయన్ కేలండర్ వ్రాసినవారు మయబ్రహ్మ వారసులని ప్రతీతి).

10)హస్త(12/09 నుండి 09/11 వరకు), చిత్త(09/11 నుండి 05/12 వరకు), స్వాతి నక్షత్ర (10/12 నుండి 11/2013)'శని' సంచారంవల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాలవల్ల కోట్లాది మంది మరణిస్తారు. రాబోయే కాలంలో తిరిగి అదే నక్షత్ర శని సంచారం వల్ల కూడా.

11) కంచి, శృంగేరి, పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డు కాలం. పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరును.

12. శ్రీశైలములో పరుసువేధి (ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది) దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది.

13. ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది.

14) నందన(2012-2013)లో శ్రీశైల మల్లిఖార్జునుని గుడిలో పొగ, మంటలు వచ్చును. శ్రీశైల మల్లిఖార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతోమాట్లాడును(అదృష్టవంతులు శివ సాయుజ్యము పొందుదురు). శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి 8 దినములుండి మేకపోతువలె అరచి మాయమగును. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు ఱంకెవేసి కాలుదువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. నంది కంట నీరు కారును.

15) విజయ నామ సంవత్సరము(2013-14)లో కోట్లమంది మరణిస్తారు.

16. శ్రీస్వామివారి సైన్యంకోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహలనుండి వస్తాయి.

17. కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమౌదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుధ్ధం.


18.గుళ్ళలో దేవుళ్ళకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిఱ్ఱున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడెదరు.


19. వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రములు చదువును.


20) తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు.

21.సూర్యనంది భూకంపంలో నేలమట్టమౌతుంది.

22) యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.

23) క్రోధి నామ సం.(2024-25)లో భారతదేశానికి ప్రళయ భీకర యుధ్ధం. ఢిల్లీ, బొంబాయిలపై అణుబాంబుల వర్షం. దేశ రాజథాని ఢిల్లీనుండి ఆనెగొందికి మారుతుంది. అదే సంవత్సరం(2024-25) లో నెల్లూరు నీటమయమౌతుంది.

24) కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది. శ్రీ కాళహస్తి, కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతయి. 120 దివ్య దేవాలయములు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమౌతుంది. తిరుమల వేంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లె చేరుతాయి.

25) కృష్ణానది వరదలతో అనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది.

26) భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది.

27. కంచికి పడమట కామధేనువు జన్మిస్తుంది.

28. నవనారసింహ క్షేత్రాలు, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, ఆనెగొంది, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు.

29. బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగకపోగా వ్యతిరేకముగా జరుగును.

30. ఆఱు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి.

31. కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాదిమంది మరణం.

32. భయంకరమైన తుఫానులు, వరదలవల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కోట్లాదిమంది దుర్మరణం. భూకంపంవల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది.

33. ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాదులతో అనేకమంది హతమౌతారు (బహుశా జీవ, రసాయన ఆయుధముల వల్ల కావచ్చు)

34. మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.

35.'శని' సంచారం - మీనరాశిలో ఉండగా మ్లేఛ్ఛులకు హాని, వృషభరాశిలొ ఉండగా ఈశాన్య దిశ నుండి వచ్చే విషపుగాలి వల్ల మరణాలు, మిధున రాశిలొ ఉండగా పాపులలో ఎక్కువమంది మరణిస్తారు (తేది.29-03-2025 నుండి 10 సంవత్సరములు పైబడి).. అమెరికా, రోమ్, బ్రిటన్ మొదలగు పశ్చిమ దేశాల సర్వనాశనానికి నాంది.

36. ఒక తోక చుక్క వల్ల భూభ్రమణములో మార్పువస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కన్పిస్తాడు. తేది.02-08-2027 (సూర్యగ్రహణం) నాడు, సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణు మూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోక చుక్క 33 రోజులు కన్పిస్తుంది.

37) తేది.15-03-2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. తేది.30/03/2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతొ మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద(2034-35), రాక్షస(2035-36) నామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాదిమంది హతమౌతారు, ఈ సమయంలోనే కలియుగధర్మం నాశనమౌతుంది.

38. దాదాపు 400 సంవత్సరముల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లెలో చింతచెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు తేది.7/8-06-2036 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారిచే తీయబడి బహిరంగపరచ బడతాయి. ఆనాటి నుండి, వ్యక్తిగత, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానములో వ్రాయబడినట్లు యధాతధంగా జరుగుతాయి.

39) ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దంవలన పింగళ (2037-2038), కాళయుక్తి (2038-39) మరియు రౌద్రి(2040-41) లలో కోట్లాదిమంది హతమౌతారు.

40) కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి.

41) ఉత్తరాయణమందు ఉత్తరభారత దేశస్తులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాలవల్ల కోట్లాదిమంది హతం.

42) తేది.24-05-2039 నుండి 21-06-2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపంవల్ల అద్దంకి(ప్రకాశం జిల్లా) నేల మట్టమౌతుంది.

43) క్రీ.శ.2040లో 40 రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో నీరు ఉండదు.

44) పండ్రెండు రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వరోజున భయంకరమైన వరదలు వస్తాయి.

45) తేది.15/16-02-2041(రౌద్రి,మాఘ పౌర్ణమి)నాడు ఒక్కసారిగా ఏడు కోట్లమంది దుర్మరణం పాలౌతారు.

46) తేది 26/27-11-2044(రక్తాక్షి,మార్గశిర శుధ్ధ సప్తమి)నాడు, చెన్నపట్నం (మద్రాసు) లో, ఏడేండ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు, మూడు కాళ్ళు, నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయేముందు, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుధ్ధం (3వ ప్రపంచయుద్దం/ది ఆర్మగెడ్డాన్) గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఈ యుధ్ధం 19-01-2045 నుండి 16-02-2045 మధ్య మొదలౌతుంది. యుధ్ధాలు పరిసమాప్తి క్రీ.శ. 2060 తో అవుతాయి. ప్రళయాలు క్రీ.శ.2066 దాక కొనసాగుతాయి.

47. అమెరికాలో ఒక నగరం భూకంపంతో నేలమట్టమౌతుంది. ఆ విపత్తునుండి ఐదు కుటుంబాలు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. ఇండో-మయా సంస్కృతి తిరిగి పునరుజ్జీవనమౌతుంది. అమెరికా అతి బీద దేశమౌతుంది.

48. గోపురము కూలి కుంభుని (కుంభకోణం) రూపు మారుతుంది.

49. శైవులు వైష్ణవుల మధ్య కలహాలు. బ్రతుకు దుర్భరమై 1,11,000 మంది బ్రహ్మంగారి జీవ సమాధి వద్ద గండకత్తెరలతో తలలు తెగకోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. ఏఱులై పాఱిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది. జీవసమాధిని పగులగొట్టుకుని బైటకు వచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు.

50) అమావాస్యనాడు, ఉదయగిరి పర్వతముమీద, చక్రాంకితుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు. సుదర్శన చక్రమును చూసి ప్రజలు ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారు.

51) క్షిపణి, అణుదాడిలో హంపి (కర్నాటక) దెబ్బతింటుంది.

52) మాయాజంగాలు (రోబోట్ సైనికులు) వస్తారు.

53) వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణముగల మనుషులు పుడతారు.

54)ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి.

55) వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది. (హనుమంతులవారిచే వ్రాయబడిన రామాయణ నిజచరిత్ర, రావణబ్రహ్మ కు సంబంధించిన వస్తువులు శ్రీలంక, మినికాయ్ ద్వీపము, రామేశ్వరము, తిరువనంతపురములకు అనుసంధానించబడ్డ యొక సముద్రగర్భ సొరంగములో వున్నవని ప్రతీతి.)

56) నాస్తికత్వము ప్రబలుతుంది. వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు. ఒకరియాలు మరొకరి పాలగును.

57) ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు.

58) భారతదేశం ముక్కలౌతుంది. వింధ్య పర్వతముల నుండి సేతువు (రామేశ్వరము) మధ్య ప్రదేశము, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతియైన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది (సామంత రాజ్యముగా).

59) వేంకటేశ్వరుని కుడిభుజము అదురును, విగ్రహము పగుళ్ళిస్తుంది, తిరుమలలో భూకంపము వస్తుంది. తిరుమలకు వెళ్ళే రహదారులన్నీ మూసుకు పోతాయి.

60) పుష్యమాసములో మ్లేఛ్ఛదేశాలకు హాని.

61) తేది.26-08-2054(భావ,శ్రావణ,బహుళ అష్టమి) నాడు, నదీనదములు పొంగి పల్లెలు, పట్నాలు దెబ్బతింటాయి.

62) జులై-ఆగష్టు,2055 మధ్య ఒక ఆదివారమునాడు, తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతూండగా, అకస్మాత్తుగ వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలౌతారు.

63) ధాత(2056-57)నామ సంవత్సరము వచ్చేప్పటికి వైశ్యులలో 25 గోత్రాలవారు మాత్రమే మిగులుతారు.

64) తేది.03-02-2058(ఈశ్వర,మాఘ,శు.దశమి) నాటికి అన్ని దేశాలు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత రాయలవారి వశమౌతాయి. ఆ తేది నుండి సమస్త భూమండలాన్నీ శ్రీశ్రీశ్రీ స్వామివారు 108 సంవత్సరములు పరిపాలిస్తారు. శ్రీవారి వారసులు వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు.

65) బహుధాన్య(2058-59)లో 25 పట్టణాలలో రక్తపాతం. అంతర్గత కలహాలు, విపత్తులు.

66) పార్ధివ(2065-66)లో కర్నూలుకు ఉత్తరాన ఒక దేవాలయములో వున్న వేపచెట్టుకు నెల రోజులు పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ చెట్టునుండి వచ్చే విషపు గాలివల్ల వేలాదిమంది మరణిస్తారు.

67) నైతిక విలువలు మృగ్యమౌతాయి. విశృంఖలత పెరుగుతుంది.

68.)గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది. ఈ సంఘటన హైదరాబాదుకు జరుగబోయే చివరి అణుప్రమాదాన్ని సూచిస్తుంది.

69) బ్రాహ్మణులు సేవకా వృత్తితో జీవిస్తారు.

70) విశ్వబ్రాహ్మణులతో వచ్చిన ఒక వ్యాజ్యములో బ్రాహ్మణులు ఓడిపోతారు.

71) వన్యజీవులు ఊళ్ళ మీద పడి భీభత్సం సృష్టిస్తాయి.

72) రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులౌతారు.

73) ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.

74) పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది.

75) కొండపగిలి నిలువ నీడ లేక కనకదుర్గ కందిమల్లాయపల్లె చేరుతుంది.

76) అంగడిలో సరస్వతిని అమ్ముతారు.

77) సముద్రములు కలుషితమై జలచరములు చాలామటుకు నశిస్తాయి.

78) అహోబిళములోనున్న ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూస్తాయి.

79) పరుశురాములవారి లేక ఆచార్య నాగార్జునులవారి లేక సనారీవారి లేక సిధ్ధపురుషుల లేక పై అందరి శిష్యుడైన వ్యక్తి ఈ దేశ అప్పులు తీర్చి, నదీనదములను అనుసంధానము చేసి సస్యశ్యామలము చేస్తాడు.

80) మూడవ ప్రపంచయుధ్ధం ముగిసేనాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులుతుంది.

81) తేది.09-04-2005(ఉగాది,పార్ధివ)నుండే శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారు తుది తీర్పులు ఇవ్వడం మొదలుబెట్టినారు. అవశ్య మనుభోక్తవ్యమ్ కృతంకర్మశుభాశుభం.

82) కాలజ్ఞాన గోవిందవాక్యము 19 ప్రకారము శ్రీ ఆల్లూరి సీతారామరాజు (శ్రీ అల్లూరి శ్రీరామ రాజు)బ్రిటీషువారిచే చంపబడలేదు. అదృశ్యుడైనట్లు మాత్రమే వుంది.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారితో పాటు ఇంకా నలుగురు కూడా కాలజ్ఞానమును రచించినారు. వారు (1) శ్రీ ఈశ్వరీ మహాదేవి (బ్రహ్మంగారి మనుమరాలు), కందిమల్లాయపల్లెలో జీవసమాధిలో ఉన్నారు, (2) శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారు (పాలకొండ, శ్రీకాకుళం జిల్లా) (ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నారు), (3) శ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామివారు (ముప్పవరం, ప్రకాశం జిల్లా) (ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నారు). (4) శ్రీ శరభేశ్వరస్వామివారు (కర్నాటక) ప్రస్తుతం ఉదయగిరి(నెల్లూరుజిల్లా),వద్ద ఉన్నారు.

కల్కిస్తుత పరమశివ స్తోత్రము

1) గౌరీనాధం విశ్వనాధం శరణ్యభూతావాసం వాసుకీ కంఠభూషం త్ర్యక్షం పంచాస్యాదిదేవం పురాణవందే సాన్ద్రానంద సందోహదక్షం.
2) యోగాధీశం కామనాశం కరాళగంగా తరంగాక్లిన్న మూర్ధానమీశం జటాజూటాటోపరిభిత్పభావం మహాకాలం చన్ద్రభాలం నమామి
3)స్మశానస్ధం భూతవేతాలసం నానాశస్రై: ఖందశూలాదిభిశ్చ వ్యాగ్రాతుగ్రా బాహవో లోకనాశో యశ్య క్రోధోద్ధూత లోకోత్మేతి
4) యో భూతాధి: పంచభూతై సిస్రుక్షు: తన్మాత్రత్మా కాలకర్మ స్వభావై: ప్రహృత్యేదం ప్రాప్య జీవత్వమీశో బ్రహ్మానందో రమతే తం నమామి
5) స్ధితో విష్ణు: సర్వజిష్ణు: సురాత్మా లోకాన్ ధాధూన ధర్మసేతూన్ విభర్తి బ్రహ్మాద్యాంశే యోఁభిమానీ గుణాత్మా శబ్దాద్యం గేస్తపరేశ నమామి
6) యజ్ఞస్యా వాయవో వాంతిలోకే జ్వలత్యాగ్ని: సవితా యాతి తప్యన్ శీతాంశు ఖేతారకై: సంగ్రహశ్చై ప్రవర్తతే తం పరేశం ప్రపద్యే
7) యస్యాశ్చాసాత్ సర్వధాత్రీ ధరిత్రీ దేవో వర్షత్యమ్బుకాల: ప్రమాతా మేరుర్మధ్యే భువనానాంచ భర్తా తమశాన విశ్వరూపం నమామి.

1) శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి మన్త్రము
ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ: సౌ: క్లీం ఐం శ్రీం హ్రీం ఓం శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామినే నమ:


2) శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి మన్త్రము
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ:


3) శ్రీశ్రీశ్రీ ఈశ్వరీ మహాదేవి మన్త్రము
ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ ఈశ్వరీదేవినే నమ:


శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు పఠించిన శ్రీ వీరభద్రస్వామి ఖడ్గము
ఓం నమోభగవతే అధర్వణ మహాశాస్త్ర మహామంత్రాధికారిణే! శ్రీంహ్రీంక్లీం కాత్యాయనీ కుమార! క్లీంక్లీం శరభావతార హ్రాం ఆదిమశూర! ఝుంకార! ప్రళయరుద్రాకార! క్షంక్షాం సప్తకోటి మహామంత్రాధికార! ఓం నమో వీరాయ నీ భూతికేలంబూని నొసటన్ ధరింప, భుక్తిముక్తి ప్రదంబులౌ కామిని, మోహిని, ఢాకిని, భూతప్రేతపిశాచ బ్రహ్మరాక్షస, మారీగణ, యక్షిణీ గ్రహంబులున్ మొదలగు శల్యతంతు, శరతంతు, శాపరతంతు, జంబూకతంతు, రోమతంతు, సర్పతంతు, సర్వ వ్యాఘ్ర భల్లూకాది మంత్రయంత్ర తంత్రజ్ఞులకున్ నోళ్ళాడక కాళ్ళాడక ఊరకంజూతురు బాలగ్రహ, నేలగ్రహ, దివసగ్రహ, వారగ్రహ, పక్షగ్రహ, మాసగ్రహ, ఋతుగ్రహ, ఆయనగ్రహ, అబ్దగ్రహ, క్రూరగ్రహ, కృకరగ్రహ, చండీగ్రహ, ముండీగ్రహ, యక్షిణీగ్రహాదులన్ నిలువంజాలక నీకు మ్రొక్కులిడి వటద్వీపంబునకుంజను శంభుని వరపుత్ర అతిపరాక్ర విక్రమ సర్వదేవతాగర్వ భంజన! పాహిమాం శ్రీపోతులూరి పురనివాస భూతిభాస భూతనాశ రిపుగణదోర్బలధ్వంస శ్రీమహోద్దండ వీరభద్ర! నమస్తే నమస్తే నమ:
దీనిని పఠించి తీర్థ ప్రాసాదములుగాని, విభూతిగాని ఇచ్చినచో సమస్త పీడలు, ప్రయోగ దోషములు, తొక్కిడివలన వచ్చిన గ్రహ దోషములు మొదలగు సమస్త విధ దోషములు పరిహారమగును.







ఆధారం

ఈ రచనకు ఆధారం, శ్రీశైలంలో వున్న నా గురుదేవులైన శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారు, శ్రీశ్రీశ్రీ ఆచార్యా నాగార్జునులవారు, శ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరులవారు, శ్రీశ్రీశ్రీ భార్గవరాముల వారి సమకాలికులైన మరో ఇద్దరి వద్ద చదువుకున్న ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, ప్రణవవేదము; నేను తెలుసుకున్న విషయములు, వారివద్ద చూసిన శ్రీశ్రీశ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళప్రతులు.

నివేదన
ఈ గ్రంథంలో మీకు ఏదైనా బాగుందనిపిస్తే అది నా గురుదేవుల అనుగ్రహం. తక్కిన దోషాలన్నీ నావి. చేతగానితనమంతా నాది.

పావులూరి శ్రీనివాసాచారి

(పాంచజన్య విశ్వకర్మ)